Thursday, August 20, 2015

నాగులచవితి విశిష్ఠత



నాగులచవితి విశిష్ఠత

 నాగుల చవితి - కార్తీకశుద్ద చతుర్దశి నాడు - దీపావళి వెళ్ళిన నాలుగో రోజున వస్తుంది. పుట్టిన బిడ్డలు బ్రతకక పోతేను , పిల్లలు కలుగక పోతేను, నాగ ప్రతిష్ట చేసి పూజించటం సాంప్రదాయం . అలా నాగ మహిమతో పుటిన సంతానానికి, నాగలక్ష్మి, నాగేశ్వరరావు, నాగయ్య వగైరా పేర్లు పెట్టుకుంటారు. మన పురాణాలలో నాగుల చవితి గురుంచి ఎన్నో గాథలు ఉన్నాయి. దేశమంతట పలు దేవాలయల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని నమ్మకం. మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను ' వెనుబాము' అని అంటారు. అందులో కుండలినీ శక్తి మూలాధారచక్రంలో "పాము" ఆకారంలో వుంటుందని "యోగశాస్త్రం" చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిదురిస్తున్నట్లు నటిస్తూ, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని కక్కుతూ, మానవునిలో ' సత్వగుణ' సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్పపుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే, మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది, అందరి హృదయాలలో నివశించే ' శ్రీమహావిష్ణువు" కు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే! నాగుపాము పుట్టలో పాలు పోయుటలోగల అంతర్యమని చెప్తారు. రోజున ఉదయమే ,తలస్నానము చేసి పుట్టదగ్గరికి వెళ్ళి, నాగరాజుకు పూజించి పాలు పోసి చలిమిడి, చిమ్మిలి, అరటిపళ్ళు, తాటి బుర్రగుంజు , తేగలు మున్నగున్నవి నివేదన చేస్తారు. పుట్ట మట్టిని పుట్టబంగారం అని, దానిని కొద్దిగా తీసుకొని చెవి దగ్గర పెట్టుకుంటారు . ముఖ్యముగా చెవి బాధలు వున్నవారికి పుట్టబంగారం పెడితే చెవి బాధ తగ్గుతుందంటారు. సందర్భంగా పుట్ట వద్ద " దీపావళి" నాడు మిగిలిన మతాబులు, కాకరపువ్వొత్తులు, టపాసులు మొదలైనవి చిన్నపిల్లలు ఎంతో సంతోషంగా కూడా కాలుస్తారు.
నాగులచవితి పాటలు కూడా మన తెలుగువారిలో ఎంతో ప్రసిద్ధం:
నన్నేలు నాగన్న , నాకులమునేలు ,
నాకన్నవారల నాఇంటివారల ఆప్తమిత్రులనందరిని ఏలు .
పడగ తొక్కిన పగవాడనుకోకు ,
నడుము తొక్కిన నావాడనుకొనుము .
తోక తొక్కిన తొలుగుచూ పొమ్ము .
ఇదిగో ! నూకనిచ్చెదను మూకనిమ్ము.పిల్లల మూకను నాకిమ్ము .
అని పుట్టలో పాలు పోస్తూ , నూక వేసి వేడుకుంటారు .అలాగే,
పుట్టలోని నాగేంద్రస్వామి లేచి రావయ్యా!
గుమ్మపాలు త్రాగి వెళ్ళిపోవయ్యా!
చలిమిడి వడపప్పు తెచ్చినామయ్యా!
వెయ్యి దండాలయ్య, నీకు కోటి దండాలయ్యా!
పుట్టలోని నాగేంద్రస్వామి!! ....
అంటూ తాము పోసిన పాలు నాగేంద్రుడు తాగితే, తమ మనసులోని కోర్కెలన్నీ తీరుతాయని భక్తుల నమ్మకం.ఆలయాలలో నాగదేవతలకు ఘనంగా పూజలు చేస్తారు. ప్రతి ఏటా నాగులచవితి రోజున తిరుమలలో కోనేటిరాయుడైన శ్రీవారిని పెద్దశేష వాహనంపై ఊరేగించడం ఆనవాయితీ. అలాగే గురువారం వాహన సేవకు ఆరోజంతా వుపవాసముండి మరునాడు పారాయణ చేసి భుజిస్తారు. పాముపడగ నీడ పడితే పశువులకాపరి కూడా ప్రభువు అవుతాడంటారు !కాని పాములకు పుట్టలో పాలు పోయడం వల్ల వాటి ప్రాణాలకు హాని అని,అందుకని వాటి సహజ నివాసములలో పాలూ, గుడ్లూ వెయ్యొద్దని చెప్తున్నారు. దానికి బదులు ఇళ్ళలోనే బియ్యం పిండితో నాగ మూర్తులను చేసి, వాటికి శాస్త్రోక్తంగా అన్నీ సమర్పించవచ్చు. ప్రకృతి మానవ మనుగడకు జీవనాధరమైనది కనుక దానిని దైవస్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టును, పుట్టను, రాయిని, రప్పను, కొండను, కోనను, నదిని, పర్వతాన్ని - ఇలా సమస్త ప్రాణికోటిని దైవస్వరూపంగా చూసుకొంటూ! పూజిస్తూ వస్తున్నారు. ఇదే మనభారతీయ సంస్కృతిలోని విశిష్టత. నిశితంగా పరిశీలిస్తే ... అందులో భాగంగానే నాగుపామును కూడా నాగరాజుగా, నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు. పాములు భూమి అంతర్భాగంలో నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి నీటిని ప్రసాదించే దేవతలుగా తలచేవారు. ఇవి పంటలను నాశనంచేసే క్రిమికీటకాదులను తింటూ, పరోక్షంగా రైతుకు పంటనష్టం కలగకుండా చేస్తాయట!. అలా ప్రకృతిపరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి. నాగుపాముల సహజ నివాసాలను ఉండనిచ్చి, ప్రకృతిని కాపాడుకుంటే అంతకన్నా గొప్ప పూజ ఇంకొకటి ఉంటుందా?


కార్తికేతు సితే పూజ్యః చతుర్ధ్యాం కార్తికేయకః!
మహాచతుర్ధీ సా ప్రోక్తా సర్వపాపహరం శుభా!!

దీపావళి అనంతరం వచ్చే కార్తీకశుద్ధ చవితిని నాగులచవితి అంటారు. రోజు నాగదేవతను పూజిస్తారు. కార్తీకశుద్ధ చవితినాడు సూర్యోదయానికి ముందు ఆకాశంలో తూర్పు దిక్కున శేషుని నక్షత్ర రూపం కనిపిస్తుంది. ఇది సర్పాకరంలో ఉంటుంది. కనుక ఈచవితిని నాగుల చవితి అని పిలుస్తారు.

తెల్లవారుజామునే స్నానం చేసి, నువ్వులు, బెల్లంతో చిమ్మిలి, బియ్యం నాన బెట్టి పిండి చేసి బెల్లం, కొబ్బరి వేసి చలిమిడి చేస్తారు. నాగేంద్రుని పుట్టదగ్గరకి వెళ్లి పసుపు, కుంకుమ, పువ్వులతో పూజ చేస్తారు. చిమ్మిలి, చలిమిడి, అరటిపళ్ళు,తాటిగుంజు నైవేద్యం పెడతారు. ఆవుపాలు పుట్టలో పోస్తారు. చిమ్మిలి, చలిమిడి పుట్టలో వేస్తారు.

 "పడగ తొక్కితే పారిపోయి, నడుం తొక్కితే నావాళ్ళనుకుని, తోక తొక్కితే తొలగిపోయి, కళ్ళు, కాలు ఇచ్చి చల్లగా చూడు తండ్రీ!" అంటూ నాగేంద్రుని ప్రార్ధిస్తారు.

సాయంత్రం వరకు ఉపవాసం ఉండి వాటినే ఫలహారంగా తింటారు. ఇలా చేయడం వల్ల పుణ్యం లభించటమే కాకుండా చలికాలంలో నువ్వులు, బెల్లం తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. పిల్లలతో చన్నీటి స్నానాలు చేయించటం వాళ్ళ చేవిలోపోటు రాదనీ, కళ్ళకి మంచిదని భావిస్తారు

No comments:

Post a Comment